Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి భక్తులు కాలినడకన భక్తులు వస్తున్నారు. దీంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు శనివారం ఉదయం నుండి లింగ దర్శనం ఉండదని కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈఓ డీ పెద్దిరాజు స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్దం విస్తృత ఏర్పాట్లు చేసి, ఏప్పటికప్పుడు వాటిపై శ్రద్ద కనబరచాలని అధికారులను ఈఓ డీ పెద్దిరాజు ఆదేశించారు. భక్తులందరూ శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము 3.00గంటలనుండి అర్దరాత్రి వరకు మూడు క్యూలైన్లలో ఉచిత, శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఆలయం తెరిచినప్పటి నుండి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. అలాగే కాలినడక భక్తులకు మార్గమధ్యలో అన్నదానంతోపాటు మంచినీటి సరఫరా చేస్తున్న పలు స్వచ్చంద సంస్థలకు దేవస్ధానం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలినడక భక్తులకు శ్రీఘ్రదర్శనం దర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. అటవీ ప్రాంతం నుండి కాలినడకతో వచ్చే వారికి వైద్య సేవలు అందించుటకు దేవస్థానం దవాఖానలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.