తిరుపతి : కాణిపాకం (Kanipakam) లోని వరసిద్ధి వినాయకస్వామి (Varasiddhi Vinayaka Swamy) వారి బ్రహ్మోత్సవాలను సందర్భంగా ఆదివారం టీటీడీ(TTD) తరఫున ఈవో జె. శ్యామల రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఈవో తెలిపారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈవో విద్యా సాగర్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు
. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ టీటీడీ ఈవోను సన్మానించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల (Tirumala) లో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతా నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్నికూడా నిండిపోయి కృష్ణాతేజ గెస్ట్హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 80,735 మంది భక్తులు దర్శించుకోగా 40,524 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Income) రూ. 3.19 కోట్లు వచ్చిందని వెల్లడించారు .