AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అభ్యర్థులను మారుస్తుండటం వైసీపీలో కలవరం సృష్టిస్తోంది. సీటు రాని అభ్యర్థులు పక్క పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పలువురు నేతలు వైసీపీని వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాగే కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి స్పందించారు.
తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరిగే ప్రచారంలో నిజం లేదని మానుగుంట మహీధర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరినీ కలవలేదని.. ఆ అవసరం కూడా తనకు లేదన్నారు. వైసీపీ అధిష్ఠానంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. టికెట్ రాకపోతే ప్రశాంతమైన జీవితం గడుపుతానని తెలిపారు. అంతేకానీ ఎట్టిపరిస్థితుల్లో టీడీపీలో చేరనని తేల్చి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు. బీసీలకు టికెట్ ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. కాగా, కందుకూరు ఎమ్మెల్యే సీటును అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల రామారావు యాదవ్కు కన్ఫార్మ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.