విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రెవిన్యూ, పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు.
కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం.. ఈ వేళలో సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి రానున్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు అధికారులు అనుమతివ్వనున్నారు. బెజవాడ దుర్గమ్మను దాదాపు మూడు లక్షలకు పైగా భక్తులు దర్శించుకోనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లను ఉచితంగా ప్రకటించారు. రేపటి వరకు 5 లక్షల లడ్డూలను అధికారులు సిద్ధంగా ఉంచనున్నారు.
మూలా నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లిలోని అధికారిక నివాసానికి చేరుకుంటారు. ఇంద్రకీలాద్రిపై పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.