తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి (Kalyana Venkateswara Swamy) స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వర్ణరథోత్సవాన్ని(Golden chariot) దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసమని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వీజీవో బాలి రెడ్డి ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్లు వెంకట స్వామి, చెంగల్రాయులు పాల్గొన్నారు.