తిరుమల : కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారని వేదపండితులు తెలిపారు.
అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, వీజీవో బాలిరెడ్డి పాల్గొన్నారు
ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
భువనేశ్వర్కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించింది. ఈ మేరకు విరాళం డీడీని తిరుమల అన్నమయ్య భవనంలో ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సంస్థ తరఫున ఇప్పటివరకు రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్టు దాత తెలిపారు.