అమరావతి : మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. కాకినాడలో ఉన్న ఆయన కార్లను రత్నకుమర్ అనే వ్యక్తి స్వాధీనం చేసుకున్నాడు . కేఏ పాల్ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని వాటిని అడిగితే తనను బెదిరిస్తున్నారని రత్నకుమార్ ఆరోపించాడు. నిన్న పాల్ కాన్వాయ్లో ఉండే రెండు కార్లను రాత్రి రత్నకుమార్ తన షెడ్లో పెట్టుకున్నాడు.
ఇవాళ వాటిని తీసుకునేందుకు వచ్చిన పాల్ డ్రైవర్లకు రత్నకుమార్ అనుచరుల నుంచి వ్యతిరేకత రావడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. కేఏ పాల్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాటిని ఇచ్చిన తరువాతనే వాహనాలను తీసుకెళ్లండని రత్నకుమార్ అనుచరులు మొండికేశారు. దీంతో కేఏ పాల్కు చెందిన బౌన్సర్లు వాహనాలను తీసుకెళ్లేందుకు రాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడే ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులను తీసుకుని విచారణ చేపడుతున్నారు.