తిరుపతి : తిరుపతి(Tirupati) లోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకాన్ని (Jyeshtabhishekam) ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి (Govindarajaswamy ) వారి ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చడం చేస్తారని వివరించారు.
ఇందులో భాగంగా ఈనెల 16న కవచాధివాసం, 17న కవచ ప్రతిష్ఠ, 18న కవచ సమర్పణ నిర్వహిస్తారని , మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారని వెల్లడించారు. స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం జరిపిస్తామన్నారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు.