అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) దరఖాస్తు చేసుకున్న హౌస్ కస్టడీ పిటిషన్పై తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా (Adjourned ) వేశారు. పిటిషన్పై సోమవారం మూడు విడతలుగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరుఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా , సీఐడీ తరుపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు.
రేపు ఉదయమే తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా మధ్యాహ్నం తీర్పు ఇవ్వనున్నట్లు సమాచారం. రిమాండ్ను హౌస్ కస్టడీ (House Custody) గా మార్చాల్సిన అవసరం లేదని పొన్నవోలు వాదించారు. ఆదివారం రాత్రి నుంచి కూడా హౌస్ కస్టడిపై చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వాదించినప్పటికీ తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.
సీఐడీ తరఫున వాదించిన పొన్నవోలు వాదనలు కొనసాగిస్తూ ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉండడం వల్ల చంద్రబాబుకు హౌస్ కట్టడీకి అనుమతించవద్దని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ పూర్తిస్థాయి భద్రత ఉంటుందని పేర్కొన్నారు.జైలులో 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటారని ఆయన వివరించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అవుటర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటిషన్
చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court ) లో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి అవుటర్ రింగ్రోడ్ కేసులో అవకతవకలు జరిగాయని పీటీ వారెంట్ పిటిషన్ వేసింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.