విశాఖపట్నం: బంగాళాఖాతంలో జిమెక్స్-22 ఆరో ఎడిషన్ ప్రారంభమైంది. జిమెక్స్లో జపాన్, ఇండియాకు చెందిన నౌకాదళాలు పాల్గొన్నాయి. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగిన ఈ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్డీఎఫ్) నౌకలకు రియర్ అడ్మిరల్ హిరాటా తోషియుకి, కమాండర్ ఎస్కార్ట్ ఫ్లోటిల్లా ఫోర్, అలాగే ఇండియన్ నేవల్ షిప్లకు కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఎడిషన్ 2012 లో జపాన్లో మొదలుపెట్టిన జిమెక్స్ 10 వ వార్షికోత్సవాన్ని సూచిస్తున్నది. ఈ నౌకాదళ విన్యాసాలు భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో కూడా సహకరించనున్నాయి. ఉపరితలం, ఉప-ఉపరితలం, వాయు డొమైన్లలో సంక్లిష్టమైన వ్యాయామాల ద్వారా రెండు దేశాల సముద్ర దళాల మధ్య ఉన్న అధిక స్థాయి ఇంటర్ ఆపరేబిలిటీని ఏకీకృతం చేయడమే ఈ జిమెక్స్-22 లక్ష్యం.
భారత నౌకాదళానికి చెందిన మూడు స్వదేశీయంగా నిర్మించిన యుద్ధనౌకలు సహ్యాద్రి, స్టెల్త్ ఫ్రిగేట్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కార్వెట్లు కడ్మట్, కవరత్తి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటికి తోడుగా గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ రణ్విజయ్, ఫ్లీట్ ట్యాంకర్ జ్యోతి, ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సెల్ సుకన్య, సబ్మెరైన్లు, ఎంఐజీ 29 కే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, పలు నౌకలు కూడా ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. జిమెక్స్-22 రెండు దశల్లో కొనసాగుతుంది. ఒకటి సముద్రంలో వ్యాయామాలు కాగా, రెండోది విశాఖపట్నం హార్బర్ దశగా ఉన్నాయి.