తిరుపతి : తిరుపతి కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం (JEO Veerabraham) అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 4న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
ఏప్రిల్ 5న ధ్వజారోహణం, 9న గరుడ సేవ(Garuda Seva) , ఉగాది పండుగ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. 10న హనుమంత వాహనం, 13న చక్రస్నానం Chakrasnanam) తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10గంటలవరకు , రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారన్నారు . ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీరామనవమి (Srirama navami) ఉత్సవాలు, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ తెప్పోత్సవాలు జరుగనున్నాయని వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు భక్తులను ఆకట్టుకునేలా భజనలు, కోలాటాలు, ఇతర కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను రప్పించాలన్నారు. భక్తులు రామకోటి రాసేందుకు వీలుగా పుస్తకాలు అందించాలని వెల్లడించారు.