అమరావతి: జంగారెడ్డి గూడెం ఘటన ఏపీ అసెంబ్లీని మరోసారి కుదిపేసింది. రెండో రోజు కూడా జంగారెడ్డి గూడెం నాటు సారా మరణాలపై చర్చించాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనలకు దిగారు. సభా కార్యక్రమాలకు భంగం కలిగించవద్దని స్పీకర్ పదే పదే హెచ్చరించారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టారు.
కల్తీ సారా తాగి జనాలు చనిపోతుంటే ప్రభుత్వం తప్పుడు వివరణ ఇస్తున్నదని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. దీనిపై సమగ్రమైన చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే, ఈ అంశంపై నిన్ననే క్లారిటీ ఇచ్చిందున మళ్లీ చర్చించడం కుదరదని ప్రభుత్వం సభకు తేల్చి చెప్పేసింది. అయినప్పటికీ చర్చించాల్సిందేనంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వీరి ఆందోళనల మధ్య సీఎం జగన్ జోక్యం చేసుకొని.. లేని సమస్యను ఉన్నట్టు చూపించి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే టీడీపీ సభ్యులు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నరన్నారు. టైట్ సెక్యూరిటీ, నిఘా ఉన్న ప్రాంతంలో సారా ఎలా కాస్తారని జగన్ ప్రశ్నించారు. 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డి గూడెంలో నాటు సారా కాయడం సాధ్యమయ్యే పనేనా అంటూ జగన్ వారిని నిలదీశారు.
సీఎం జగన్ చెప్పినప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. స్పీకర్ పోడియం నుంచి వెనక్కి రాలేదు. బాధితులకు న్యాయం చేయాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభ మార్మోగిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆందోళనలు కొనసాగాయి. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు చినరాజప్ప, రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్, భవానీ, బెందాళం అశోక్, గణేష్ కుమార్, జోగేశ్వరరావు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సభకు పదే పదే అడ్డుతగులుతుండటంతో సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా, ఇదే ఘటనపై సోమవారం ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. వాళ్లను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు.