అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ మంత్రులు, జనసేన నాయకుల మధ్య దత్తపుత్రుడు వ్యాఖ్య వివాదం మరింత ముదురుతుంది. నిన్న ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణిలు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రుల వ్యాఖ్యలను జనసేన నాయకులు మీడియా సమావేశంలో ఖండించారు. గుంటూరులో జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే సహించబోమని హెచ్చరించారు.
తాము ఏది చేసినా ప్రపంచానికి తెలిసే విధంగా, సంసారబద్ధంగా చేస్తామని , వైసీపీ నాయకుల్లా వ్యభిచారం చేయమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మరో నేత పోతిన మహేశ్ మాట్లాడుతూ కౌలు రైతుల ఆత్మహత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు మిత్రుడు పవన్ ఐతే వంచకుడు జగన్ అని దుయ్యబట్టారు.
పోలవరం, పులిచింతల ఎక్కడో మంత్రి రాంబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. జగన్ కేబినెట్ల ఉన్నది మంత్రులా.. కంత్రులా అని రాయల్ కిరణ్ ఆరోపించారు. దొంగలంతా జగన్ కేబినెట్లోనే ఉన్నారని విమర్శించారు. పవన్ను దూషిస్తేనే మంత్రుల ఫైళ్లపై సీఎం సంతకం పెడుతున్నారా? అని నిలదీశారు.