గుంటూరు: ప్రశ్నించడం ద్వారానే సమసమాజాన్ని ఆవిష్కరించే వీలున్నదని, తొలి ఆవిర్భావ సభలో కూడా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించామని, కార్యకర్తలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తనపై ఉన్న అభిమానాన్ని దేశంవైపు, సమాజం వైపు మళ్లించి సేవ చేయండి అని పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్యను ఎవరు మరిచినా తాము మరవమని, ఆయన స్ఫూర్తిని గుండెల్లో పెట్టుకుని ముందుకు నడుస్తామన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ శివారులో జనసేన 9 వ ఆవర్భావ బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్నారని, రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవని చురకలంటించారు. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు అంటూ ఇప్పుడు చెప్తున్న నేతలు అప్పుడు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ఎవరెన్ని మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చెప్పారు.
రాజకీయాల్లో మాటామాటా అనుకోవడం సహజమని, అయితే, తెలంగాణలో మాదిరిగా అలయ్ బలాయ్లో వైషమ్యాలు మరిచి శత్రువులను కూడా దగ్గరికి తీసుకున్నట్లుగా రాజకీయాలు ఉండాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు. రాజకీయాల్లో విబేధాలు ఉంటాయి, కానీ వ్యక్తిగత ద్వేషాలు ఉండొద్దని నమ్మే వ్యక్తినని చెప్పారు. పార్టీ నడపాలంటే వేల కోట్ల రూపాయలు ఉండటం కంటే సైద్ధాంతికంగా పనిచేసే కార్యకర్తలే అవసరమన్నారు. కేవలం 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభమై జనసేన ఇవాళ 3 లక్షల సభ్యులు ఉండే స్థాయికి చేరుకున్నదని చెప్పారు.
2019 లో గెలిచిన జనసేన ఎమ్మెల్యేను వైసీపీలో కలిపేసుకున్నారని చెప్పిన పవన్ కల్యాణ్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 7.24 శాతం ఓట్లను, స్థానిక సంస్థల ఎన్నికల్లో 27.4 శాతం ఓట్లు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎన్నో పదవులను కైవసం చేసుకున్నామని వెల్లడించారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం 27.28 శాతం ఓట్లు సాధించామని, మహావృక్షం చిన్న విత్తనంతో ఎదిగినట్లుగా మనం కూడా ఎదుగుదామని పిలుపునిచ్చారు. అపజయం ఎదురైనా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడటం కేవలం జనసేన నేతలకే చెల్లిందన్నారు. ఈ రాష్ట్రం బాగుండాలనేది జనసేన కార్యకర్తల చేతుల్లోనే ఉన్నదని, మీ పోరాట పటిమపైనే ఆధారపడి ఉన్నదన్నారు. ఆ దారిలో నేను నడిచి చూపుతా.. మీరూ ఆ దారిలో నడవండని పిలుపునిచ్చారు. ఏడు శాతం ఓట్ల నుంచి ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి జనసేన ఎదుగుతుండటం శుభపరిణామన్నారు.
అన్న వల్లే ఈ మాటలు..
ఆవిర్భావ సభ వేదికపై నుంచి జనసేన పార్టీ యాప్ను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. దీని ద్వారా పార్టీ సభ్యత్వం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జనసేన 9 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహిరంగసభ జరుపుకునేందుకు అవకాశం కల్పించిన ఇప్పటం గ్రామానికి కృతజ్ఞతగా తన వ్యక్తిగత ట్రస్ట్ తరపున రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నాగబాబు కారణంగానే తాను అంతో ఇంతో రాజకీయాలు మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. నెల్లూరులో లా చదువుతున్న రోజుల్లో ఆయన నాకు ఇచ్చిన నానీ పాల్కీవాలా రాసిన ‘వీ ద పీపుల్, వీ ద నేషన్’ పుస్తకం నాకు బైబిల్గా మారిందన్నారు.