అమరావతి : ఏపీలోని విజయవాడకు సమీపంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నెలకొల్పిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు విజయవాడలోని ఇప్పటంలో ఆవిర్భావ వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్తో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సభకు సంబంధించి ప్రచార, స్వాగత ఫ్లెక్సీలను విజయవాడలోని పలు ప్రాంతాల్లో బ్యానర్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
దీంట్లో భాగంగా విజయవాడ బ్యారేజీ వద్ద నెలకొల్పిన ఫ్లెక్సీలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంగా అక్కడికి వచ్చిన జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ఉంచి జనసేన ఫ్లెక్సీలను తొలగించడం అన్యాయమని అన్నారు.
ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. కేవలం అధికార బ్యానర్లే ఉండాలని రాజ్యాంగంలో ఎవరైన రాశారా అని నిలదీశారు. ఆవిర్భావ సభకు వేలాదిగా జనం తరలివస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు.