Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో మరోసారి అలాంటి పరాభవం ఎదురుకావద్దనే ఉద్దేశంతో ముందుగానే అలర్ట్ అయ్యాడు. గత ఎన్నికల మాదిరిగా రెండు చోట్ల నుంచి కాకుండా ఈ సారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్లకు జనసేనాని షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాకు మారాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భీమవరం, గాజువాక నుంచి కాకుండా ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఈసారి ముందుగానే అలర్ట్ అయ్యారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయం సొంతం అవుతుందనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. గెలుపు మాత్రమే కాదు.. భారీ మెజార్టీ లక్ష్యంగా వ్యూహం రచించారు. ఈ క్రమంలోనే ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లోని అనుకూల, ప్రతికూల పరిస్థితులపై పరిశీలన జరిపారు. చివరకు పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.