Pawan Kalyan | వైసీపీది ఉప్మా ప్రభుత్వం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ప్రభుత్వం వంద మంది కష్టాన్ని కేవలం 30, 40 మందికి పంచి.. దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుంటుందని మండిపడ్డారు. ఇది 70 :30 ప్రభుత్వం అని ఆరోపించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరంలో వారాహి విజయ యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
వైసీపీ దగ్గర ఉన్నట్లుగా తన దగ్గర వేల కోట్లు లేవని.. సుపారీ గ్యాంగ్లు లేవని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని 70 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. మన అనైక్యత వల్లే కొంతమంది నేతలు మనల్ని భయపెడుతున్నారని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు కోట్ల మందిని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక ఎంపీని కొట్టించగలరని.. ఎస్సీ వ్యక్తిని ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ చేయగలరని ఆరోపించారు. చంపిన తర్వాత డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని సీఎం శభాష్ అని మెచ్చుకుంటారని విమర్శించారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వచ్చిన విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇలా రెండు అభిప్రాయాలు వచ్చినప్పుడు ప్రభుత్వం వినాలని కానీ.. కులాల మధ్య చిచ్చుపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ఐక్యంగా లేకపోతే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. మనం ఐక్యంగా ఉంటేనే వారేం చేయలన్నా భయపడతారని చెప్పారు.
తాను ఓడిపోతానని నిర్ణయించుకున్న తర్వాతే ఈ క్రిమినల్స్పై పోరాటానికి దిగానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పిస్తా అన్న తిరస్కరించానని తెలిపారు. తనకు రక్షణ అవసరం లేదని.. వారాహే తనకు రక్ష అని తెలిపారు.