అమరావతి : జనసేన కీలక నేత పోతిన మహేష్ (Pothina Mahesh) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పవనకల్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పార్టీకి వెన్నదన్నుగా ఉంటూ వస్తున్న మహేష్ పార్టీ నిర్మాణంలో విశేష పాత్ర పోషించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్థానాన్ని ఆశించి భంగపడ్డ మహేశ్ సోమవారం రాజీనామా లేఖను అధినేతకు పంపించారు.జనసేన (Janasena) కు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమస్థానాన్ని చివరి సమయంలో బీజేపీకి కేటాయించడం పట్ల ఆయన మనోవేదనకు గురయ్యారు. ఈ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సుజనాచౌదరి (Sujana Choudary) కి అవకాశం కల్పించారు. ‘ నటించేవాళ్లు నాయకులు’ కాలేరని లేఖలో పేర్కొన్నారు. జనసేనకు ఆవేశంతోనో, సీటు రాలేదనో రాజీనామా చేయలేదు, కొత్తతరం నేతలను పవన్ తయారు చేస్తారని గుడ్డిగా అడుగువు వేశాం.. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్తో నడిచి భంగపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్పైగానీ పవన్ ఏనాడు దృష్టి పెట్టలేదని ఆరోపించారు.