అమరావతి : ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి (YS Jagan) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజలు జలసమాధి అయ్యేలా ప్లాన్ ప్రకారం ప్రకాశం బ్యారేజి(Prakasham Barrage ) కూల్చివేతకు కుట్ర పన్నారని మంత్రి లోకేష్ ఎక్స్ వేదిక ద్వారా మండి పడ్డారు. అధికారంలో ఉండగా జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారని ఆరోపించారు.
ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొని కూల్చేసి, విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేసి, లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా పన్నిన కుట్ర బట్టబయలైందని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది జగన్ అయితే, ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేషని ఆరోపించారు. కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారం చేస్తుందని వెల్లడించారు.