నెల్లూరు : కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పిన నల్లపురెడ్డి.. మరో అడుగు ముందుకేసి ఏదో ఒకరోజు దేశ ప్రధానిగా జగన్ ఎన్నికవుతారని జగన్మోహన్రెడ్డిని ఆకాశానికెత్తేశారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరే నేత చేయలేదన్నారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఆదరణ ఇంకా తగ్గలేదని చెప్తూ.. సీఎంగా జగన్ మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, జగన్ ప్రధాని కావాలని కూడా ప్రజల్లో కోరిక ఉన్నదని తెలిపారు. ఏదో ఒకరోజు జగన్ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని నల్లపురెడ్డి జగన్ను ఆకాశానికెత్తేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నల్లపురెడ్డి చెప్పారు. ఆయన ఎన్నోసార్లు అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, ఆయన నిజస్వరూపాన్ని గుర్తించినందున ఆయనను ప్రజలు నమ్మరన్నారు. అన్ని వర్గాల వారినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలను పూర్తిగా విస్మరించే చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎవరూ అనుకోరని నల్లపురెడ్డి వ్యాఖ్యానించారు.