విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాజశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. మూడు రోజులుగా రాజశ్యామల యాగం కొనసాగుతున్నది. దేశ రక్షణ కోసం రాజశ్యామల యాగం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు శారదాపీఠం ప్రతినిధులు తెలిపారు.
శారదాపీఠం వార్షికోత్సవానికి వచ్చిన సీఎం జగన్ను వేద మంత్రాల మధ్య పీఠం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఏటా మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకు శారద పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి. యజ్ఞ క్రతువు స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నది.
సీఎం పర్యటనను పురస్కరించుకుని శారదాపీఠం పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి అప్పలరాజు తన అనుచరులతో శారదాపీఠంలోకి వెళ్లేందుకు రాగా.. అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తామని పోలీసులు తేల్చిచెప్పడంతో మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వెళ్లిపోయారు. జగన్ శారదాపీఠానికి వస్తున్నారని తెలిసి ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చారు. అంతకుముందు విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు అధికారులు సీఎం జనగ్కు స్వాగతం పలికారు.