అమరావతి : నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. ఇటీవల మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కాకాణి గోవర్ధన్రెడ్డికి, తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ మధ్య కొనసాగుతున్న వైరుద్యం ఈనెల 17న నెల్లూరు జిల్లా వేదిక కానుంది. మంత్రి కాకాణి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పిదప జిల్లాకు తొలిసారిగా వస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, మంత్రి అభిమా నులు పెద్ద ఎత్తున్న సన్మాన, సమావేశాన్ని నెల్లూరులో నిర్వహిస్తున్నారు.
అయితే మంత్రి వర్గంలో స్థానం కోల్పోయిన అనిల్ కుమార్ అదేరోజు నెల్లూరులో బహిరంగ సభ ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు దారితోస్తుంది. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీమంత్రి మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభను కొందరు వివాదంగా మారుస్తున్నారని అన్నారు. ఎవరో కార్యక్రమం పెట్టారని తాను బహిరంగ సభ పెట్టలేదని, బలప్రదర్శన కోసం సమావేశం నిర్వహించడం లేదని కేవలం కార్యకర్తలను కలుసుకునేందుకే బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు.
సిటీ నియోజకవర్గం నుంచే కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. ఏపీ సీఎం జగన్కు సైనికుడిగానే ఉంటానని అన్నారు. సభను వాయిదా వేసుకోవాలని అధిష్టానం సూచించలేదని తెలిపారు.