విజయవాడ: ఇటీవల విడుదలైన సినిమా సహా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్పై ఏపీ సమచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. థియేటర్లలో సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 35ను విడుదల చేసిందని, ఏరియా, ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్ తదితరాల ఆధారంగా ధరలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
కొంతమంది ఎగ్జిబిటర్లు జీఓ 35 ని హైకోర్టులో సవాలు చేశారని, లైసెన్సింగ్ అథారిటీ అయిన జాయింట్ కలెక్టర్ స్టేక్హోల్డర్లతో సంప్రదించి రేట్లను నిర్ణయించడానికి అనుమతించాలని కోర్టు సూచించిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయించాలని ఎందుకు జాయింట్ కలెక్టర్లను ఎగ్జిబిటర్లు సంప్రదించడం లేదని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతితో టికెట్ ధరల ఖరారుపై జీవో జారీ చేయడంలో జాప్యం జరిగిందని, అయితే దీన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు.
రాజకీయ పొత్తు ఏకపక్ష ప్రేమ వ్యవహారం కాదని మంత్రి పేర్ని నాని అన్నారు. జనసేనతో పొత్తుకు అవకాశం ఉన్నదని, అందుకే టిక్కెట్ల విషయంలో రాజకీయం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని మంత్రి చెప్పారు. జనసేనతో టీడీపీ కలిసినా తమకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. పవన్ కళ్యాణ్ను వైసీపీ ఎప్పుడూ సీరియస్ పొలిటీషియన్గా పరిగణించలేదని ఆయన పేర్కొన్నారు.