అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇటీవల 11 వ పీఆర్సీకి సంబంధించిన అశాస్త్రీయ జీవోల విడుదలపై ఏపీలోని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నూతన జీవోలను రద్దు చేసేంతవరకు తాము చేపట్టే ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని జేఏసీ ప్రతినిధులు బండిశ్రీనివాస్ , బొప్పరాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వ జీవోలపై ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ప్రతినిధులు ఈరోజు మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఐఆర్కంటే తక్కువ ఫిట్ మెంట్ తీసుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇది చీకటి రోజని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తిరస్కరిస్తున్నామని వారు వెల్లడించారు. పీఆర్సీ 27శాతంతో పాటే డీఏలు ఇవ్వాలని , లేకపోతే పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో సాధించుకున్న ఫించన్ల హక్కును తొలగించే అధికారం ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రాట్యూటి సీలింగ్ను ఎత్తివేయడం దుర్మార్గమైన చర్యని వారు తెలిపారు.
పదేండ్లకొకసారి ఇచ్చే కేంద్ర పీఆర్సీ అక్కర్లేదని ఐదేళ్లకొక్కసారి ఇచ్చే రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకుని నూతన జీవోలపై స్పందించకపోతే రేపు, ఎల్లుండి సమావేశాల్లో్ తీసుకునే భవిష్యత్ కార్యాచరణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వెల్లడించారు. అధికారులు ఇచ్చిన నివేదికనే జీవోల రూపంలో జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివరించారు. అశుతోష్ మిశ్ర రిపోర్టు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. అవసరమైతే సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ ఫెన్షన్లర్ల ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చే 20వ తేదీన ఇరు జేఏసీల పక్షాన ప్రకటించే కార్యాచరణను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని.. అవసరమైతే సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.