విశాఖ: పర్యాటకులను ఆకర్శించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వినూత్న ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని పర్యాటకులకు సేవలందిస్తున్నది. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకుల కోసం రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్ బిసా ఒక ప్రకటన విడుదల చేశారు.
కశ్మీర్ హెవెన్ ఆన్ ఎర్త్ యాత్ర జూలై 29న విశాఖపట్నంలో ప్రారంభమై ఆగస్టు 1న విశాఖపట్నంలో ముగుస్తుంది. ఈ యాత్ర 3 రాత్రులు, 4 పగళ్లుగా ఉంటుంది. మెస్మరైజింగ్ కేరళ ట్రెక్ ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభమై.. ఆగస్టు 15న విశాఖపట్నంలో ముగుస్తుంది. ఇది (5 రాత్రులు, 6 పగళ్లుగా ఉంటుంది. ఇండిగో ఎయిర్లైన్స్ ఎకానమీ క్లాస్ విమానాలను ఈ ప్యాకేజీకి అందుబాటులో ఉంచనున్నారు.
ఈ పర్యటనలకు వెళ్లాలని ఆసక్తి ఉన్న వారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఐఆర్సీటీసీ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా 0891–2500695, చందన్కుమార్- 82879 32318, గణనాథ్- 82879 32281 నంబర్లలో సంప్రదించాలని చంద్రమోహన్ తెలిపారు.