అమరావతి : నిబంధనలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ నుంచి నిఘా ఉపకరణాలు కొనుగోలు చేశారని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వరావుపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న సస్పెన్షన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అధికారిని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సర్కార్ను ఆదేశించింది. 1969 అఖిలభారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని సుప్రీం తేల్చి చెప్పింది. ఏబీవీపై సస్పెన్షన్ను కొనసాగించాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ పిటిషన్ను సైతం కొట్టివేసింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది.
సుప్రీం కోర్టులో తనకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై ఏబీవీ ఢిల్లీలో స్పందించారు. చట్ట ప్రకారంగా తనకున్న అవకాశాలు ఉపయోగించుకున్నానని అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. ఏ బావ కళ్లల్లో , ఏ సైకో కళ్లలో ఆనందం కోసం నాపై దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. అప్పటి డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ ఆదారంగా, ఏడీజీ సీఐడీ ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా అప్పటి చీఫ్ సెక్రటరీల అనుసరించిన విధానాల కారణంగా తనపై సస్పెన్షన్ వేశారని ఆయన వివరించారు. కొనుగోలు అనేదే లేనపుపడు అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
తన విషయంలో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన వారందరినీ శిక్షించాలని కోరారు. ప్రజల సొమ్ము తిని బాకీ పడ్డ వారు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని అన్నారు. ప్రభుత్వాలు నడిపేవాళ్లు వస్తుంటారు..పోతుంటారని, ప్రజలు, ప్రజలు రాసుకున్న శాసనం, ధర్మం, న్యాయం శాశ్వతమని అన్నారు. నేను లోకల్. ఎవరిని వదలిపెట్టనని ఏబీవీ అన్నారు. దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో నిబంధనల్ని అతిక్రమించారంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరిలో సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.