విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. విజయనగరంలో దొంగతనం చేసి ఛత్తీస్గఢ్లో తల దాచుకున్న నిందితుడ్ని పట్టుకుని, ఆయన నుంచి 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం ఎస్పీ ఎం దీపిక వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని గంటస్తంభం సమీపంలో రవి జ్యూవెలరీ దుకాణం.. ఈ నెల 22న మంగళవారం సెలవు కావడంతో దుకాణం తెరవలేదు. బుధవారం ఉదయం షాపు తెరిచిన యజమాని ఆల్మరాల్లోని పెట్టెలు ఖాళీగా కనిపించాయి. దాంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దొంగతనం జరిగిన ప్రదేశాన్ని విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును ఛాలేంజిగా తీసుకున్నారు.
నిందితుడిని పట్టుకునేందుకు విజయనగరం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తుదకు ఛత్తీస్గఢ్లో పట్టుకున్నారు. లోకేష్ శ్రీవాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి.. అతడి నుంచి 6.181 కిలోల బంగారు ఆభరణాలు, 90.52 గ్రాముల వెండి బ్రాస్లెట్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు దొంగతనం కేసుల్లో ఇదే నిందితుడు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పీ ఎం దీపిక అభినందించి.. ప్రశంసా పత్రాలు అందజేశారు.