Lunar eclipse | చంద్ర గ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి ప్రధానాలయం మూసివేశారు. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 06. 30 గంటలకు కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు నిర్వహిస్తారు. ఆ తర్వాత అర్చన, మహానివేదన, హారతి ఇచ్చి మరోసారి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తారు.
చంద్ర గ్రహణం కారణంగా సుప్రభాత సేవతోపాటు ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ శాంత్రి హోమం, రుద్రహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, శ్రీ చక్ర నవావరణార్చన, చండీహోమం, పంచ హారతులు, పల్లకీ సేవ మొదలైన సేవలన్నింటినీ రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి యధావిధిగా అన్ని దర్శనములు, ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు.
గ్రహణం సమయంలో నది ఒడ్డున జపాలు చేయడం, ఇష్ట దైవాన్ని ఆరాధించడం చాలా మంచిదని ఇంద్రకీలాద్రి ఆలయ అర్చకులు శ్రీనివాస శాస్త్రి తెలిపారు. మేష రాశి వారితోపాటు మరికొన్ని రాశుల వారు గ్రహణానంతరం దానాలు చేయడం వల్ల ఇబ్బందులు తొలగించుకోవచ్చునని సూచించారు. గర్భిణిలు గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలని చెప్పారు. గ్రహణానంతరం విడుపు స్నానం చేసి దానాలు ఇవ్వడం చాలా మందిదని తెలిపారు.