Srisailam | సోమవారం శ్రీశైలంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సర్వం సన్నద్ధమైంది. ఆమె పర్యటనకు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ చెప్పారు. ఆదివారం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టీ నిశాంతిలతో కలిసి ఎఎస్ఎల్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ద్రౌపది ముర్ము పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పరిశీలించారు.
హెలిప్యాడ్ లోని గ్రీన్ రూము, సేఫ్ రూమ్, విజిటర్స్ రూములను పరిశీలించారు. అక్కడ ఉన్న వైద్య నిపుణులతో కలెక్టర్ అత్యవసర మందులు, వైద్య పరికరాలపై ఆరా తీశారు. హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టాయిలెట్లను పరిశీలించారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రంలో చెంచు విద్యార్థుల సుస్వాగత నృత్యం, చెంచులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని, ధ్యాన మందిరాన్ని సుందరీకరించాలని సంబంధిత కేంద్ర ఇన్చార్జి అధికారులకు కలెక్టర్ సూచించారు.
విధులు నిర్వహించే సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి కొవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
విధులు నిర్వర్తించే సిబ్బంది జాబితాలను ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాల్లో ముమ్మర పారిశుధ్య చర్యలు చేపట్టాలని డీపీఓ, ఆత్మకూరు మునిసిపల్ కమీషనర్ను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విధులు నిర్వహించే అధికారులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. అధికారులు ముందుగానే సంబంధిత ప్రదేశాలకు చేరుకోవాలన్నారు.