AP News | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కాకినాడ తీరం వెంట సముద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పింది. తీరప్రాంత రక్షణ సిబ్బంది (కోస్ట్గార్డ్) సకాలంలో సహాయకచర్యలు చేపట్టడంతో 11 మంది మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకొన్నారు. కాకినాడ తీరం నుంచి బోటులో 11 మంది మత్స్యకారుల బృందం శుక్రవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లింది.
తమ వెంట వంట కోసం తీసుకెళ్లిన సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి. మత్స్యకారులు సెల్ఫోన్ ద్వారా విషయాన్ని తీర ప్రాంత రక్షణ సిబ్బందికి తెలిపారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది చేరుకొనే లోగానే బోటు పూర్తిగా కాలిపోయింది. అందులోని 11 మంది మత్స్యకారులను సురక్షితంగా కాపాడి తీరానికి చేర్చారు. కాలిపోయిన బోటు విలువ దాదాపు రూ.40 లక్షల వరకు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు.