తిరుమల : శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ( Salakatla Theppotsavam) సందర్భంగా తిరుమలలో నాలుగురోజుల పాటు పలు సేవలను రద్దు చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న తెప్పోత్సవాల సందర్భంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ(TTD) రద్దు చేసింది. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.
తొలిరోజు మార్చి 20న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణి (Pushkarini) లో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారని వెల్లడించారు. రెండోరోజు మార్చి 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు, 22న శ్రీభూ సమేతంగా మలయప్ప స్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. 23న శ్రీమలయప్పస్వామివారు ఐదుసార్లు, 24న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారని వెల్లడించారు.