తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో మంగళవారం క్రోధినామ సంవత్సర ఉగాది(Ugadi) ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతమలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని ఉంచి ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు.
అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ ( TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
మహతిలో ఘనంగా ఉగాది ఉత్సవం
తిరుపతి : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి (Tirupati) లోని మహతి కళాక్షేత్రంలో ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు.
శ్రీ వేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం ఆచార్య దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో ఆముదాల మురళి అష్టావధానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.