హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం శాస్ర్తోక్తంగా స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుంచి భూవరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య స్నపన తిరుమంజనం, సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
చక్రస్నాన సుముహుర్తాన స్వామి పుష్కరిణిలో స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసి ఉన్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్య్రం. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం శ్రీవేంకటేశ్వరస్వామిని 67,906 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 28,492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా రూ.2.50 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.