కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటలకు వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాలైన నల్లగొండ, సూర్యాపేటలో ఆ ప్రభావం కనిపించింది. బుధవారం కోదాడ, దామరచర్ల, నందికొండ సరిహద్దుల్లో ఆంధ్రా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత ఆంధ్రాకు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. అత్యవసర సేవలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే అనుమతించారు. ఆర్టీసీ బస్సులను కూడా వెనక్కి పంపించారు. తొలిరోజు కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించగా గురువారం నుంచి పకడ్బందీగా నిర్వహించనున్నారు.
కోదాడ రూరల్, మే 5 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి కర్ఫ్యూ విధించడంతో ఆ రాష్ట్ర సరిహద్దులు మూసివేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారులోని పాలేరు వాగు మీదుగా తెలంగాణ నుంచి ఆంధ్ర వైపు వెళ్తున్న వాహనాలను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నల్లబండగూడెం శివారులోని రామాపురం క్రాస్ వరకు మాత్రమే నడిపింది. అక్కడ నుంచి ఆంధ్రరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట, షేర్మహ్మద్పేట, గరికపాడు, నందిగామ వైపు ప్రయాణికులు సరిహద్దులో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో అక్కడి ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేసింది. ఈ సందర్భంగా అక్కడి అధికారులు మాట్లాడుతూ కర్ఫ్యూ అమలు ఉన్న సమయంలో ప్రతిఒక్కరూ గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు రాష్ట్రంలోకి అనుమతి లేదని తెలిపారు. కొన్ని అత్యవసర సర్వీసులతోపాటు, వ్యవసాయానికి సంబంధించిన వాహనాలకు, ముందుగా బుక్ చేసుకున్న విమాన సర్వీసు, రైల్వే ప్రయాణికులు టిక్కెట్లు చూపించిన వాహనాలను అనుమతించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది.
నందికొండ : కరోనా వైరస్ విజృంభిస్తుండంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నది. దీంతో సరిహద్దు రాష్ర్టాల నుంచి ఆంధ్రలోకి వచ్చే వాహనాలపై ఆంక్షలు విధించారు. అత్యవసర సేవ వాహనాలు, గూడ్స్ ట్రాన్స్పోర్టు వాహనాలను మాత్రమే అనుమతిస్తూ, పబ్లిక్ ట్రాన్స్పోర్టు వాహనాలను అనుమతించడం లేదు. కరోనాను నియంత్రించడానికి రెండువారాల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని ఆంధ్రా సరిహద్దు అధికారులు తెలిపారు. బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. అనుమతి లేకపోవడంతో బస్సులను పైలాన్కాలనీ బస్టాండ్ వరకు మాత్రమే నడుపుతున్నారు.
నిలిచిపోయిన బస్సు సర్వీసులు
దామరచర్ల : తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులోని పొందుగుల చెక్పోస్టు వద్ద నేటి నుంచి వాహనాలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రా పోలీసులు తెలిపారు. లాక్డౌన్ కారణంగా రోజూ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తొలిరోజు కావడంతో చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనదారులకు చెప్పి వదిలేశారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రా బస్సు సర్వీసులను, ఆటోలను నిలిపివేశారు. తెలంగాణలోని పలు ఆర్టీసీ డిపో బస్సులు ఆంధ్రాకు వెళ్లి మధ్యాహ్నం వరకు తిరిగి వచ్చేశాయి. ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలు తెలంగాణలోకి అనుమతిస్తారు కానీ తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలను మధ్యాహ్నం 12గంటల తర్వాత నిలిపివేస్తారు. ఆంధ్రాలోని పొందుగుల చెక్పోస్టు వద్ద గురువారం అదనపు పోలీసు బలగాలు మోహరించనున్నాయి. అత్యవసరాలైన పాలు, కూరగాయలు, అంబులెన్సు వాహనాలతోపాటుగా అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు.