Kotamreddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతుంటే.. ఇప్పుడు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి కోటంరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కోటంరెడ్డి తగ్గలేదు. ప్రెస్మీట్ పెట్టి మరీ ఈ విషయంపై ఫైర్ అయ్యారు.
కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఫోన్ చేసి బెదిరించాడు. ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ పెద్దల జోలికి వస్తే బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్యల లాక్కొని వెళ్తానని వార్నింగ్ ఇచ్చాడు. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదు.. అయిదు నిమిషాల్లో వచ్చి లాక్కొనిపోతా అని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన కోటంరెడ్డి.. సజ్జల, ఏపీ మంత్రి కాకాణిపై విరుచుకుపడ్డారు.
తనకు బెదిరింపు కాల్స్ వచ్చినా భయడపకుండా అంతా వింటున్నానని.. రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. తనను, తన తమ్ముడిని కొట్టుకుంటూ తీసుకెళ్తానని కడప నుంచి ఎవరో అనిల్ అనే వ్యక్తితో ఫోన్ చేయించారని పేర్కొన్నారు. సజ్జల కోటరీ నుంచి ఆ వ్యక్తి మాట్లాడినట్టు తెలిసిందని అన్నారు. ఎవరో వ్యక్తితో ఫోన్ చేయించిన సజ్జలకు చెప్పేది ఒక్కటేనని.. తాను అలాంటి వ్యక్తిని కాదని స్పష్టం చేశాడు. మళ్లీ తనకు ఫోన్కాల్స్ వస్తే.. నెల్లూరు రూరల్ నుంచి మీకు వీడియో కాల్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవాలని సజ్జలను హెచ్చరించారు. తనపై కిడ్నాప్ కేసు పెట్టారని.. అవసరమైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోమని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయాలి తప్ప ఫోన్లు చేయించి భయపెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.