శ్రీశైలంలో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. ఈ ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్ఠాపన, శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వామి వారి యాగశాల సమీపంలో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మించారు. వరుసగా మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు.
సోమవారం ఉదయం అన్నపూర్ణాదేవి విగ్రహానికి గణపతి పూజ, పుణ్యహవచనం, రుత్త్విగ్వరనామం, యాగశాల ప్రవేశం, మండపారాధన, స్నపనం, జలాదివాసం నిర్వహిస్తారు. సాయంత్రం అన్నపూర్ణాదేవి విగ్రహానికి జనప్నుష్టాలు, మృతసంగ్రహణం, అంకురారోహణం, అగ్నిప్రతిష్టాపన, క్షీరాభిషేకం నిర్వహిస్తారు.
మరుసటిరోజు (జూన్ 14న) ఉదయం జపానుస్తలు, అన్నపూర్ణాదేవి విగ్రహానికి మహాస్నపనం, ధాన్యాదివాసం, ఆదివాసంగ హోమం, సాయంత్రం మూల మంత్ర జప హోమం, అన్నపూర్మాదేవి విగ్రహానికి పుష్పాదివాసం, శయ్యద్వాసం నిర్వహిస్తారు. ముగింపు రోజైన జూన్ 15న గణపతి పూజ, పుణ్యాహవచనం, హవనములు నిర్వహించి సాయంత్రం శ్రీ అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన, శిఖర ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి, నేత్రోల్మినము, కలశోద్వాసన, స్నపనము, రీరాజన మంత్రపుష్పములు, తీర్థపరాయణములు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి దీవెనలు పొందాలని అధికారులు కోరారు.