BTech Ravi | తనను అంతమొందించేందుకు ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. అందుకోసమే తన గన్మెన్లను తొలగించారని అన్నారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి.. తనకు ఉన్న ఇద్దరు గన్మెన్లు ఉదయం వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. బీటెక్ రవికి ఏదైనా జరిగితే తనదే బాధ్యత అని జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాన్వాయ్తో వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని.. తనకు ఏదైనా జరిగితే జగన్, భారతి, ఎంపీ అవినాశ్రెడ్డిదే బాధ్యత అని అన్నారు. గన్మెన్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తానని బీటెక్ రవి స్పష్టం చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ మారుస్తున్నారని.. అది వాళ్ల పార్టీ అంతర్గత విషయమని దాన్ని పట్టించుకోమని బీటెక్ రవి అన్నారు. అయితే ఎమ్మెల్యేలను మార్చే క్రమంలో నిన్ను నువ్వు మార్చుకోవద్దు అని జగన్ను కోరారు. అలా మార్చుకుని పులివెందులలో లేకుండా పోతే తన పరిస్థితేంటి అని ప్రశ్నించారు. ‘ పులివెందుల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయం.. పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యం, పులివెందుల ప్రజలకు గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినవు కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తున్నా.’ అని తెలిపారు. అందుకే తన సీటు మార్చుకోవద్దని జగన్ను విజ్ఞప్తి చేశారు ఒకవేళ జగన్ పులివెందులను విడిచి వేరే చోటుకు వెళ్తే.. తను కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబును సైతం విజ్ఞప్తి చేశారు.