విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు భయంతో బ్రతుకుతున్నారని, దాడులకు దిగుతూ తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. ఇలా దాడులు చేయడం అనేది జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని దుయ్యబట్టారు. దానిలో భాగంగా సినిమా పరిశ్రమను కూడా బలిచేస్తున్నాడని మండిపడ్డారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నా పట్టించుకోని కారణంగా అదాని డేటా సెంటర్ విశాఖ నుంచి ముంబైకి వెళ్లిపోయిందన్నారు. రాజధాని కడతాం అంటున్న వైసీపీ పెద్దలు.. మూడేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారని వ్యాఖ్యానించారు. మా హయాంలో కట్టిన భవనాల్లోనే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయని చెప్పారు. గురువారం మధ్యాహ్నం లోకేష్ వైజాగ్లోని కోర్టుకు హాజరయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎవరు తప్పుడు వార్తలు రాసినా పరువు నష్టం దావా వేస్తానని, ఇది రాజ్యాంగం తనకు కల్పించిన హక్కని నారా లోకేష్ చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా గైడ్లైన్స్లో వార్తలు ఎలా రాయాలో స్పష్టం చేసిందని, తన వివరణ తీసుకుని కూడా వార్త ప్రచురించలేదన్నారు. తప్పనిసరిగా సాక్షిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకుండా చూసే లక్ష్యంతో పనిచేస్తానని చెప్పారు. 2019 లో సాక్షి, డక్కన్ క్రానికల్పై వేసిన పరువు నష్టం దావా కేసు ఇవాళ హియరింగ్కు వచ్చినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తనపై ఈ పత్రిక దాడి చేయడం మొదలుపెట్టిందని తెలిపారు.
తన వ్యక్తిగత జీవితంపై జగన్ సొంత మీడియా బురద జల్లిందని నారా లోకేష్ ఆరోపించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిందని.. అలాంటి వాటికి తాను ఎప్పుడూ భయపడనన్నారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని కించపర్చేలా మాట్లాడారని, ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశానని చెప్పారు. తన తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని ఈ సందర్భంగా లోకేష్ శపథం చేశారు. వైఎస్ విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి తాము మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. కానీ, అది తమ సంస్కృతి కాదని.. తమకు సంస్కారం అడ్డువస్తుందన్నారు.