Chevireddy Bhaskar Reddy | లిక్కర్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఏ తప్పూ చేయని తనను అన్యాయంగా ఈ కేసులో ఇరిగించారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ తప్పుల మీద తప్పులు చేస్తోందని విమర్శించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి జైలుకు తరలించే సమయంలో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. లిక్కర్ను ద్వేషించే తనను అదే కేసులో జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం.. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. మద్యం ముట్టలేదు, అమ్మలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి.. అంతేకానీ చిన్నతనం నుంచి దూరం పెట్టిన మద్యాన్ని నాపై రుద్దడం భావ్యం కాదని ఆవేదన చెందారు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారని.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎప్పుడూ మద్యం జోలికి పోలేదని తెలిపారు. వేద పాఠశాల నడుపుతున్నానని.. తాను ఎప్పడూ అబద్ధం చెప్పనని వ్యాఖ్యానించారు. పైన దేవుడు చూస్తున్నాడని.. అనుభవిస్తారని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారందరికీ ఆగస్టు 26 వరకు రిమాండ్ విధించింది.