తిరుమల : హైదరాబాద్కు చెందిన ఐఆర్ఎస్ (IRS ) మాజీ అధికారి దివంగత వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు( Bhasker Rao) తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు , బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 లక్షలను విరాళంగా( Huge donation) అందించి అచంచలమైన భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో 3,500 చదరపు అడుగులు గల ఉన్న ఆనంద నిలయం భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.
అదేవిధంగా బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు , వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు, వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు , వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షల చొప్పున విరాళంగా అందివ్వాలని సంకల్పించారు.భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం ట్రస్టీలు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్ వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు.
ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో రూ.2 కోట్లు విరాళం
హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.2 కోట్లు చెక్కుల రూపంలో విరాళంగా అందించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.