అమరావతి : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి లేఖను పంపించారు. కరోనా వ్యాప్తితో అనేక రాష్ట్రాలు ఇప్పటికే సెలవులు ప్రకటించాయని గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండువారాల పాటు సెలవు ప్రకటించాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంకా 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని లోకేశ్ వెల్లడించారు. మూడో విడత కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో విద్యార్థులు, గురువుల ప్రాణాలతో ఆరోగ్యంపై చెలగాటం ఆడొద్దని సూచించారు. ఏపీలో కరోనా కేసులు 10 రోజుల్లోనే 500 నుంచి 5వేలకు పెరిగాయని తెలిపారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని జగన్ను కోరారు.