అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లాలో బ్యాంక్ భవనంపై హీలియం పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయిన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఆగిరిపల్లికి చెందిన షేక్ అలీయా అనే మహిళ తన కూతురుతో పాటు ఆమె వెంట వచ్చిన మరో చిన్నారితో కలిసి బ్యాంక్కు వెళ్లింది.
తల్లి బ్యాంక్ పనుల్లో నిమగ్నమై ఉండగా ఇద్దరు చిన్నారులు బ్యాంక్ మేడపైకి వెళ్లి ఆడుకుంటుండగా మేడపై ఉన్న ఓ పార్టీకి చెందిన హీలియం బెలూన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.