హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు పార్లమెంటులో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తొలిదశ సహాయ, పునరావాసం కూడా అంతవరకే చెల్లించాలని, 20,946 నిర్వాసిత కుటుంబాలకే ఖరారైందని వెల్లడించారు. 2023 మార్చి నాటికే తొలిదశ పూర్తి కావాల్సి ఉన్నదని, దీనిలో జాప్యం జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్టు మంత్రి తెలిపారు.