విజయవాడ: రానున్న రెండు రోజుల పాటు ఏపీలోని రాయలసీమ, కోస్తాంద్రలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. బంగ్లాదేశ్పై ఉన్న ఉపరితల ద్రోణి వాయవ్య దిశగా పయనించి దక్షిణ జార్ఖండ్లో కేంద్రీకృతమైనందున ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
సోమవారం ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, పశ్చిమ కోస్తాలో తీర ద్రోణి విస్తరణ కారణంగా అరేబియా సముద్రం నుంచి బలమైన గాలులు మధ్య భారతదేశం మీదుగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాగల 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
ఆదివారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని గ్రామాల్లో డ్రైనేజీల్లోకి భారీగా నీరు చేరింది. ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. రోడ్లపై విరిగి పడిన చెట్లను తొలగించారు. ముంపు అవకాశం ఉండే ప్రజలను అప్రమత్తం చేశారు.