అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పిడుగులు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాగల మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచన చేశారు. రెండు రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. మంగళవారం వెంకటగిరిలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు వర్షం కురియగా.. సీతానగరం 8.8, బొబ్బిలి 8.3, సాలూరు 7.3, కొయ్యూరు 6.6, లింగసముద్రం 6.1, అమలాపురం 5.8, చోడవరం 5.2, గోకవరం 5.0 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర, దక్షిణ ద్రోణి పయనిస్తున్నది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. అలాగే ఈ నెల 9 వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపింది. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడ పిడుగులు పడేందుకు ఆస్కారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ విజ్ఞప్తి చేసింది. సముద్రం అల్లకల్లోంగా ఉంటున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించింది.