అమరావతి : గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఇవాళ జరుగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్ ఎన్నికకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని ఆదేశించడంతో సుమారు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు మధ్య ఎన్నికను నిర్వహిస్తున్నారు.
ఎన్నికల్లో టీడీపీకి చెందిన 9 మంది సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది గెలుపొందగా ఒకరు జనసేనకు చెందిన అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి జనసేన మద్దతు తెలుపు తుండడంతో మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మొదట కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత వైస్ ఎంపీపీ ఎన్నిక, అనంతరం ఎంపీపీ ఎన్నిక జరుగనుంది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో వైసీపీ తరఫున సుభాని నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ తరుఫున వహీదుల్లా నామినేషన్ వేశారు.