శ్రీశైలం : శ్రీశైలం ( Srisailam Project ) జలాశయానికి జూరాల ( Jurala ) , సుంకేశుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు 2,52,524 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 3,72, 246 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35, 315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,311 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం 10 గేట్లు 10 అడుగులు ఎత్తి 2,76,620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.30 అడుగుల వరకు నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలకు 210.51 టీఎంసీల నీరు ఉందని పేర్కొన్నారు.