అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో విజయవకాశాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య (Hari Ramajogaiah) సంచలన లేఖను విడుదల చేశారు . ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు (Alliance candidates) విజయం సాధించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు కూటమి ఇస్తున్న హామీల ముందు వైసీపీ హామీలు తేలిపోతున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ(TDP) కి 100, జనసేన (Janasena) 16, బీజేపీ (BJP) 5 స్థానాల్లో విజయం వరిస్తుందని వెల్లడించారు .
గత కొన్ని నెలలుగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) కు రామజోగయ్య పూర్తి మద్దతిస్తూ వచ్చారు. రాజకీయ పరిస్థితుల కారణంగా పవన్కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు (Letters) రాశారు. ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు తీసుకోవాలనే తన ఆలోచనను వివరించారు. అధికారంలోకి వస్తే పదవికాలాన్ని చెరి రెండున్నర సంవత్సరాల పాటు ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
హరి రామజోగయ్య లేఖలపై స్పందించకపోవడంతో తెలుగుదేశం, జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలు ఇద్దరికి నచ్చినట్లు లేదు. అది వారి ఖర్మ. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదంటూ మరో లేఖను సంధించారు. కూటమి పొత్తులు నచ్చక హరి రామజోగయ్య కుమారుడు సైతం జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయినప్పటికీ జనసేనకు సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నారు.
తాజాగా విడుదల చేసిన లేఖలోనూ జనసేన మేలు కోరే విధంగా ఉండడం విశేషం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మొదటి స్థానంలో , పవన్కల్యాణ్ రెండోస్థానంలో అధికార హోదాలో ఉంటారని లేఖలో ప్రస్తావించడంపై జనసేన పట్ల ఆయనకున్న మక్కువను తెలియజేస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.