తిరుమల : ఈనెల 12న తిరుమలలో హనుమజ్జయంతి ( Hanuman Jayanti ) వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు( TTD Officials ) వివరించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయని తెలిపారు.
తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమి నాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున జపాలి హనుమాన్కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.మొదటి ఘాట్రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుందని తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుంచి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.