అమరావతి : టీడీపీ పాలనలో చేనేతలకు కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కృష్ణ జిల్లా పెడన గ్రామంలో అప్పుల భారంతో చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. చేనేత రంగం తల్లడిల్లేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అప్పుల ఊబిలో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
టీడీపీ హయాంలో నేతన్నకు ఏడాదికి సుమారు రూ.50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ప్రభుత్వం నిలిపేసిందని మండిపడ్డారు. సొంత మగ్గం ఉన్న వారికే నేతన్నహస్తం వర్తించేలా నిబంధనలు పెట్టారని వారు పేర్కొన్నారు. ఆప్కో కొనుగోళ్లు ఆగిపోవడంతో పాటు మంజూరీ, రాయితీలు నిలిచిపోయాయని ఆరోపించారు. గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించి ఆత్మహత్యలు నివారించాలని ప్రభుత్వానికి సూచించారు.